14-01-2026 12:54:22 AM
సికింద్రాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): అల్వాల్లోని మచ్చ బొల్లారం రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన కార్యక్రమం రసాభాసగా మారింది. మంగళవారం నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా వేదికపైన ఉన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డికి మధ్య అండర్ బ్రిడ్జి పనులకు తామంటే తాము నిధులు తెచ్చామంటూ వాగ్వాదానికి దిగారు.
దీంతో ఒక్కసారిగా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కూడా గొడవకు దిగారు. నిధులను తామే తెచ్చామంటూ వాదోపవాదాలు జరిగాయి. ఇరు పార్టీల నేతలు పరస్పరం నినాదాలతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాల నాయకులను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులతో జరిగిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తామే తీసుకువచ్చామని బ్యానర్లు వేయడం మూలంగా గొడవ జరిగినట్లు తెలుస్తోంది.