calender_icon.png 6 December, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాలో అగ్నిప్రమాదం

06-12-2025 10:10:53 PM

హైదరాబాద్ యువతి మృతి..

జోడిమెట్ల శ్రీనివాస కాలనీలో విషాదం అలముకుంది..

ఘట్ కేసర్ (విజయక్రాంతి): ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్ యువతి ఉడుముల సహజారెడ్డి(24) అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి అల్బనీ ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం మంటల్లో చిక్కుకుని సహజారెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. ఆమె మరణ వార్తను జిహెచ్ఎంసి ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలోని జోడిమెట్ల వెంకటాపూర్ రోడ్డులోని శ్రీనివాస కాలనీలో నివాసముంటున్న తల్లిదండ్రులకు అధికారులు సమాచారం అందించారు. ఉన్నత విద్య కోసం 4 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లిన ఆమె ఇప్పుడు ప్రాణం కోల్పోవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగి పోయింది. 

స్టేషన్ ఘన్ పూర్ మండలం సముద్రాల ప్రాంతం గుంటూరుపల్లికి చెందిన ఉడుముల జయాకర్ రెడ్డి హైదరాబాద్ లోని టీసీఎస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య శైలజ బచ్చన్నపేట మండలంలో ఎస్జీటీగా పనిచేశారు. ఇటీవల డిప్యుటేషన్ పై హైదరాబాద్ వచ్చారు. కొన్నేళ్లుగా ఈ కుటుంబం హైదరాబాద్ లోని జోడిమెట్లలో నివాసం ఉంటోంది. జయాకర్ రెడ్డి, శైలజ దంపతులకు ఇద్దరు కూతుళ్లు కాగా చిన్న కూతురు ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్ లోనే బీబీఎస్ కోచింగ్ తీసుకుంటోంది. పెద్ద కూతురు సహజారెడ్డి 2021లో ఎంఎస్ చదువు కోసం అమెరికాకు వెళ్లారు. సహజారెడ్డి ఉంటున్న అపార్ట్ మెంట్ పక్కనున్న మరో భవనం నుంచి వచ్చిన మంటలు వేగంగా వ్యాప్తిచెందాయి.

ఆ సమయంలో నిద్రలో ఉన్న సహజారెడ్డి మంటల్లో చిక్కుకుని మృతిచెందినట్లు తెలుస్తోంది. చదువు పూర్తి అవుతున్న సమయంలో ఈ అగ్నిప్రమాదం ఆమెను బలితీసుకుంది. ప్రతిరోజూ వీడియోకాల్ లో మాట్లాడే తమ కూతురు ఇక లేదన్న వార్త తెలిసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. సహజారెడ్డి మృతి విషయం తెలియడంతో శ్రీనివాస కాలనీలో విషాదం అలముకుంది. ఆమె మృతిపై అమెరికాలోని భారత ఎంబసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపింది. ఆ కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నామని అవసరమైన సాయం అందిస్తామని పేర్కొంది.