20-01-2026 12:00:00 AM
మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): సీపీఐ మీటింగ్లో బీజేపీ బ్రిటీష్ వాళ్లకంటే డేంజర్ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తప్పుబట్టారు. అవును బీజేపీ.. డేంజరే.. మత రాజకీయాలు, హిందూ దేవుళ్లను కించపరిచేవాళ్లకు, దేశాన్ని నాశనం చేయాలని చూసే వారికి బీజేపీ డేంజరే అని కౌంటరిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమ వారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం అవ్వక ముందు రేవంత్ అంటే గౌరవం ఉండేదని, సీఎం అయ్యాక అందరూ మారిపోతున్నారని అన్నారు.
మోదీని ఢిల్లీలో పొగిడి.. ఇక్కడికి వచ్చి తిడుతున్నారని, ఈ మాటలు డిల్లీలోని చిత్రగుప్తుడు రాసుకుంటున్నాడని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు తీస్తాడని పేర్కొన్నారు. బొగ్గు గనుల ఇష్యూ పై మా చిత్రగుప్తుడు రాసుకుంటున్నాడని.. అన్నీ బయటపడతాయని హెచ్చరించారు. జీ రామ్ జీ పథకాన్ని విమర్శించడమంటే గ్రామాలపై దాడి చేయడమేనని తెలిపారు. గాంధీ పేరుతో రాజకీయాలు చేయకుండా పథకానికి పేరు మార్చి పనిమీదే మోదీ ఫోకస్ పెట్టారన్నారు.