హద్దుమీరిన అభిమానం..!
- వివాదాస్పదంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జన్మదినం.
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జన్మదినం వివాదాస్పదంగా మారింది. శ్రీరామ నవమి పర్వదినం రోజే ప్రతి ఏటా జన్మదిన జరుపుకుంటున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి తమ అభిమానులు ఫ్లెక్సీలు బ్యానర్లు వంటివి ఏర్పాటు చేయడంతో పాటు ఏడాది మరింత అభిమానం చాటెందుకు పట్టణ ప్రధాన రహదారి వెంట ఏర్పాటుచేసిన సెంట్రల్ లైటింగ్ విద్యుత్ స్తంభాలకు కూల్ ఫైర్లు ( స్పర్క్లర్) ఏర్పాటు చేశారు.
ఇవి వచ్చి పోయే వాహనదారులకు ప్రయాణికులకు ప్రమాదం కలిగించేదిగా ఉన్నాయని మున్సిపల్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎస్సై గోవర్ధన్ సహకారంతో మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి వాటిని తొలగించేందుకు సిద్ధమయ్యారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, మర్రి జనార్దన్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బిఆర్ఎస్ నేతల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
కూల్ ఫైన్ ఎవరికి ఎలాంటి ప్రమాదాన్ని తెచ్చి పెట్టేవి కావని తమ అభిమాన నాయకుడే పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే వేడుక అధికారులు అడ్డుకోవడం సరికాదని వారించారు. దీంతో బస్టాండ్ ప్రాంగణంలో కొద్దిసేపు గందరగోల వాతావరణం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ పురవీధుల్లో భారీ కటౌట్లు ఫ్లెక్సీలు నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఆయా రాజకీయ పార్టీల ముఖ్యులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం.




