27 February, 2026 | 5:03 PM

ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

27-02-2026 03:23 PM

మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

షాద్‌నగర్,(విజయక్రాంతి): కేశంపేట మండలం బైరఖాన్‌పల్లి గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి బ్రహ్మోత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, కేశంపేట మండలం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గ్రామీణ దేవాలయాల అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇచ్చామని, ధార్మిక సంప్రదాయాలకు గౌరవం కల్పించామని గుర్తుచేశారు.

గ్రామీణ సంస్కృతి, సాంప్రదాయ క్రీడలను పరిరక్షించడం తమ పార్టీ బాధ్యతగా తీసుకుంటుందని పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన గుండు పందెం పోటీలను ప్రారంభించి, యువతను ప్రోత్సహించారు. గ్రామాల్లో క్రీడా వాతావరణం పెంపొందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని, ప్రజలతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్, స్థానిక సర్పంచ్ శమంత శివకుమార్, మాజీ సర్పంచులు యాదగిరి రావు, వెంకటయ్య, కృష్ణయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.