బాపట్లలో లారీ, కారు ఢీ: నలుగురు స్పాట్ డెడ్
హైదరాబాద్: బాపట్ల జిల్లాలో(Bapatla District) ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్లపాలెం మండలం, సత్యవతి పేట సమీపంలో అర్ధరాత్రి లారీ, కారు ఢీ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతులను కర్లపాలెంకి చెందిన బేతాళం బలరామరాజు(65), బేతాళం లక్ష్మీ(60), గాదిరాజు పుష్పావతి(60), ముదుచారి శ్రీనివాసరాజు(54)గా గుర్తించారు.
ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే కొడుకు సంగీత్ ఫంక్షన్ కు హాజరైన వీరు శుభకార్యం అనంతరం తిరిగి కారులో వస్తుండగా సత్యవతిపేట(Satyavathi Peta) వద్దకు రాగానే ముందు వస్తున్న లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బతికి బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన పిల్లలను సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.






