26-06-2025 12:17:09 AM
పలు విధ్వంసకర ఘటనల్లో నిందితులు
చర్ల, జూన్ 25: చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో నలుగురు మావోయిస్టులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. వారు ఐఈడి బ్లాస్టింగ్, ఐఈడీ బాంబులను ఏర్పాటు చెయ్యడం, పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణ పనుల్లో నిమగ్నమైన వాహనాలను తగలబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించారు. అరెస్టు చేయబడిన వారిపై ఒక్కొక్కరికి రూ.10వేల రివార్డు ఉన్నది.
ఫార్సేఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నలుగురు మావోయిస్టులను కోపంఝర్రి అటవీ ప్రాంతంలో అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో మాండో కుర్సం, కైలాష్ కుర్సామ్, పాండు కుర్సామ్, చోటు కుర్సామ్ అలియాస్ బుధ్రామ్ ఉన్నారు. ఫర్సేగఢ్ జిల్లా బీజాపూర్ అరెస్టయిన మండో కుర్సామ్ గత ఏడాది జూన్ 15న పోలీస్ స్టేషన్ ఇన్చార్జి ఫర్సేగఢ్ వాహనంలో ఐఈడీ పేలుడు సంఘటనలో నిందితుడిగా ఉన్నాడు.
మావోయిస్టు స్థూపం ధ్వంసం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని థానా నెల్సనార్ ప్రాంతంలో ఇంద్రావతి నదికి సమీపంలో ఉన్న బంగోలి గ్రామంలో పోలీసు భద్రత బలగాలు మావోయిస్టులు నిర్మించిన 15 అడుగుల ఎత్తున మావోయిస్టు స్మారక స్థూపాన్ని బుధవారం కూల్చివేశారు. ఈ స్థూపాన్ని మావోయిస్టులు ఈ ప్రాంతంలో తమ భావజాలాన్ని ప్రచారం చేయడానికి, సంస్థ ప్రభావాన్ని విస్తరించడానికి నిర్మించారు.