04-01-2026 12:46:11 AM
లక్నో, జనవరి 3 : ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆ పసిపాపను భవనంపై నుంచి కిందకు విసిరేసి చంపేశారు. ఈ దారుణం జనవరి 2న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారి తండ్రి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బులంద్షహర్ జిల్లాలోని సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓ భవనంలో ఆరేళ్ల బాలికతో తల్లిదండ్రులు నివసిస్తున్నారు.
అదే భవనంలో అద్దెకు ఉంటున్న రాజు, వీరూ కశ్యప్ అనే వ్యక్తులు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఇంటిపై ఆడుకుంటున్న సమయంలో నిందితులు ఆమెను బలాత్కారం చేశారు. అనంతరం తమను గుర్తు పట్టకుండా ఉండేందుకు భవనం పైనుంచి వెనక ఉన్న పొలాల్లోకి విసిరేశారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న చిన్నారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ఎస్ఎస్పీ నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులను పట్టుకునే క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితుల కాళ్లకు బుల్లెట్లు తగిలాయి. ప్రస్తుతం వారు పోలీసుల అదుపులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాథమిక విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని హత్య, అత్యాచారం సెక్షన్లతో పాటు పోక్సో (పీఓసీఎస్ఓ) చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.