06-07-2025 01:18:27 PM
అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టును గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు ఆదివారం పరిశీలించారు. ఆనకట్ట రేడియల్ క్రస్ట్ గేట్ల పరిస్థతిని క్షుణ్ణంగా పరిశీలించిన కన్నయ్య శ్రీశైలం పదో నంబర్ గేట్ ద్వారా వచ్చే లీకేజీ వల్ల ఇబ్బందేమీ లేదన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గేట్ నుంచి నీటి లీకేజీ 10 శాతం కంటే తక్కువగా ఉందని పేర్కొన్నారు.
రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ చేయాలని సూచించారు. మరో ఐదేళ్లకైనా రేడియల్ క్రస్ట్ గేట్లు మార్చాల్సిన అవసరం ఉందని, కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్రకు ఏర్పడిన పరిస్థితే ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఆనకట్ట నుంచి 60 మీటర్ల దూరంలో ప్లంజ్ పూల్ ఉందని, దాంతో శ్రీశైలం ఆనకట్టకు ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు కొత్త గేట్ల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని కన్నయ్య నాయుడు డిమాండ్ చేశారు.