ఖమ్మంకు గోదావరి జలాలు తెస్తా
జాతీయ రహదారుల పూర్తికి చర్యలు
ప్రాధాన్యత క్రమంలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 2 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు తేవడమే తన జీవిత లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. జాతీయ రహదారులు పూర్తి చేయడం తో పాటు ఆయిల్పామ్ సాగు విస్తీర్ణణాన్ని పెంచి, రైతుల ఇంట సిరుల పంట కురిపించడమే ధ్యేయంగా పని చేస్తున్నట్లు చెప్పారు. రఘునాథపాలెం మండలం బల్లేపల్లిలోని మానుకొండ రాధాకిషోర్ పామాయిల్ తో టలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నానని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి భూసేకరణ కూడా వేగంగా జరుగుతుందన్నారు. రైతుల ఇంట సిరుల పంట పం డించేందుకు గోదావరి జలాలను వైరా ప్రాజెక్టుకు మళ్లించి, లక్షా 30వేల ఎకరాలు సా గులోకి తెచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిచినట్లు చెప్పారు.
లంకాసాగర్ ప్రాజెక్టుకు అనుసంధానం చేయడం ద్వారా మైదాన ప్రాంతాలైన వేంసూరు, సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లో మరో లక్ష ఎకరాలు సాగునీటిని సదుపాయాన్ని కల్పించాలనే లక్ష్యంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ తొలకరిలోనే వైరా ప్రాజెక్టులోకి గోదావరి జలా లను మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
యాతాలకుంట వద్ద టన్నె ల్ను పూర్తి చేసి, పెద్ద ఎత్తున ఆయకట్టు సాగులోకి తీసుకురావాలని భావిస్తున్నామని చెప్పారు. రఘునాథపాలెం మండ లాన్ని సస్యశ్యామలం చేసేందుకు మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని రూ.66 లక్షలతో చేపడుతున్నట్లు చెప్పారు. దీని ద్వారా 33 చెరువులను నింపి సాగు నీరు అందించనున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి జూలై లేదా ఆగస్టులో టెండర్లు పిలిచి, పనులు ప్రారం భించనున్నట్లు తెలిపారు.
రహదారులపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారులన్నింటిని సకాలంలో పూర్తి చేసి, ప్రారం భించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఖమ్మం సూర్యాపేట, ఖమ్మం కోదాడ జాతీయ రహదారులు పూర్తి అయ్యాయని, కోరివి ఖమ్మం జాతీయ రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి కూడా దాదాపుగా పూర్తి కావచ్చిందని, ఖమ్మం సమీపంలోని ధ్వంసలాపురం వద్ద రైల్వేపై వంతెన నిర్మాణం చేయాల్సి ఉందన్నారు.
ఈ విషయమై రైల్వే కేంద్ర మంత్రితో మాట్లాడానని, లేఖలు కూడా రాశానని చెప్పారు. రైల్వే వంతెన పూర్తయిన వెంటనే జాతీయ రహదారిని ప్రజలకు అంకిత చేస్తామన్నారు. ఖమ్మం రహదారి పూర్తయితే ఖమ్మం నుంచి రాజమండ్రికి రెండు గంటల్లోనే చేరుకోవచ్చని అన్నారు. విజయవాడకు గంటన్నరలో చేరుకోవచ్చని చెప్పారు. కొత్తగూడెం వయా తొర్రూరు జాతీయ రహదారి నిర్మాణానికి కూడా త్వరలోనే టెండర్లు పిలుస్తున్నట్లు చెప్పారు.
ఆయిల్పామ్ సాగుకు కసరత్తు
రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు తాజాగా 14 ఆయిల్ ఫెడ్ కంపెనీలకు లైసెన్స్లు ఇచ్చామని తెలిపారు. ఏటా లక్ష ఎకరాల్లో సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఏటా ఆయిల్పామ్ ధరతోపాటు దేశ వ్యాప్తంగా గిరాకీ పెరిగుతున్నదని చెప్పారు. ప్రతి రైతు ఈ పంట సాగు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.
అత్యధిక లాభాలు వచ్చే ఈ పంట సాగు చేసేందుకు ప్రభుత్వపరంగా రైతులకు అనేక ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని చెప్పారు. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నుంచి 5 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా కృషి చేస్తుందని చెప్పారు.






