04-08-2025 01:01:20 AM
పూర్వ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం
మహబూబాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాల, బాలికల జూనియర్ కళాశాలల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ప్రిన్సిపల్స్, లెక్చరర్ల ఆత్మీయ సమ్మేళనం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ నరసింహం అధ్యక్షత వహించగా, కళాశాల ప్రిన్సిపాల్ పొక్కుల సదానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తాము విధులు నిర్వహించిన నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, విద్యా బోధనకు, కళాశాలల అభివృద్ధికి చేసిన కృషిని వివరించారు. నాటికి నేటికి విద్యా వ్యవస్థలో వచ్చిన సమూలమైన మార్పులను వివరించారు. కళాశాలలో పనిచేస్తున్న సమయంలో జరిగిన సంఘటనలను ఆనాటి విద్యార్థుల క్రమశిక్షణ , చదువు పట్ల వారు చూపిన శ్రద్ధ , ప్రస్తుతము వారు వివిధ రంగాలలో రాణించిన తీరుపై చర్చించారు.
కళాశాల అభివృద్ధి పథంలో నడుపుతూ 550 మంది విద్యార్థులతో, కళాశాల అన్ని వసతులను ఏర్పాటు చేసి కళాశాలను పూలవనంలా మార్చిన కళాశాల ప్రిన్సిపాల్ పొక్కుల సదానందం ను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ కోలాహలం రామ్ కిషోర్, డాక్టర్ రంగారెడ్డి , డాక్టర్ లక్ష్మణ్ రావ్, మంగపతిరావు, లక్మి నర్సయ్య, శాంత సుగుణ , ప్రేమలత, కరుణ శ్రీ, చిరంజీవి , వెంకట రెడ్డి , యేరే నారాయణ, వీవీ నాగేందర్, వంగ రామన్న, విజయ్ భాస్కర్, చొప్పరి శ్రీనివాస్, రాజ్ కుమార్ , సునీత, రవి తదితరులు పాల్గొన్నారు.