27-06-2025 07:16:42 PM
దివ్యాంగులకు ప్రభుత్వం ఎల్లపుడు అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మహాదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అలీం కో సంస్థ ద్వారా శుక్రవారం అందిస్తున్న దివ్యాంగులకు ఉపకరణాలు (సైకిళ్లు) పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని దివ్యాంగులకు ట్రై సైకిళ్ళు, ఇతర ఉపకరణాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగులు సమాజంలో అన్ని రంగాల్లో రాణించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దివ్యాన్గులకు అవసరమైన ఉపకరణాలను అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని దివ్యాంగుల సంక్షేమానికి అన్ని విధాల కృషి చేస్తుందన్నారు.
మహదేవపూర్ మండలంలో సుమారు 200 మంది దివ్యాంగులను గుర్తించడం జరిగిందని వారిలో మొదటి విడతలో 54 మంది దివ్యాంగులకు వివిధ రకాలైన బ్యాటరీ ట్రై సైకిళ్ళు, సాధారణ ట్రై సైకిళ్ళు, వినికిడి పరికరాలు, చేతి కర్రలు, స్టాండ్ లు వారి వారి వైకల్యాన్ని బట్టి అందిస్తున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని ఇల్లు లేని దివ్యాంగులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. అతి త్వరలో నూతన పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు. నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ, ఉచిత బస్సు సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు వడ్డీ లేని రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒకొక్క హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. అనంతరం మండలానికి చెందిన 89 మంది లబ్ధిదారులకు సుమారు రూ.90 లక్షల విలువగల కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో రూ.20 లక్షల నిధులతో నిర్మించిన డా బి.ఆర్ అంబేద్కర్ చిల్డ్రన్ పార్క్ ను రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మెన్ అయిత ప్రకాష్ రెడ్డి, కూడా చైర్మెన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి లతో కలిసి ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మీ, సంక్షేమ అధికారి మల్లీశ్వరి, సీడీపిఓ రాధిక, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ చల్ల తిరుపతయ్య, మహాదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజబాబు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్బర్ ఖాన్, మాజీ ఎంపీపీ రాణి బాయి , మాజీ జెడ్పిటిసి అరుణ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్తెమ్మ, కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ కుంభం పద్మ, మాజీ ఎంపిటిసి ఆకుతోట సుధాకర్, మాజీ కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ వామన్ రావు. కాంగ్రెస్ యూత్ నాయకులు కటకం అశోక్, విలాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.