ఘనంగా వరమహాలక్ష్మి వ్రతం
మహిళలకు బొట్టు, చీరలు, గాజుల పంపిణీ
జవహర్నగర్, ఆగస్టు 21 (విజయక్రాంతి): మహిళలు సుమంగళిగా ఉండేందుకే వరమహాలక్ష్మి వ్రతం ఆచరిస్తారని జవహర్ నగర్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ సతీమణి రెడ్డి శెట్టి నాగరాణి పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ సంతోష్ నగర్ లోని అంగన్వాడి స్కూల్ వద్ద శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని వంద మంది గర్భిణీ స్త్రీలకు పసుపు బొట్టు చీరలను గాజులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెడ్డి శెట్టి నాగరాణి, రెడ్డి శెట్టి శ్రీనివాసులు హాజరై మాట్లాడుతూ మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకే ఈ వ్రతం నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పసుపు బొట్టు చీరలను అందజేస్తున్నామని తల్లి వరమహాలక్ష్మిని ఎవరైతే భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వారికి ఆ తల్లి కరుణ కటాక్షాలు ఉంటాయని తెలిపారు. అందరి కోరికలను తీర్చే కల్పవల్లి అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సహధర్మచారిని అని పేర్కొన్నారు.
తల్లి వరమహాలక్ష్మి దయతో జవహర్ నగర్ లోని ప్రజలందరూ చల్లంగా ఉండాలని కోరుకున్నట్టు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బుడిగే సవిత గౌడ్, మౌనిక రెడ్డి, రంజిత ,వసంతరాణి, అంగన్వాడి టీచర్ బాలమణి, మౌనిక, కాలనీ ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






