29-10-2025 10:01:51 AM
ఆత్మహత్యాయత్నంపై భిన్న అనుమానాలు
అధికారుల పర్యవేక్షణ లేమి
ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పాఠశాల యాజమాన్యం
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి(Gurukulam student ) ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది ముమ్మాటికి అధికారుల పర్యవేక్షణ లేమి అనే స్పష్టం అవుతుంది. వివరాల్లోకి వెళితే సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో 10 వ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థిని ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. తోటి విద్యార్థులు, అధ్యాపకులు సకాలంలో గుర్తించటం కారణంగా ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడి, పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సను అందించారు.
స్థానికుల కథనం ప్రకారం ఖమ్మం మండలానికి చెందిన విద్యార్థిని ఉదయం ప్రార్థనకు సిద్ధమవుతుండగా ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని పదవ తరగతి విద్యార్థులపై అకారణంగా చేయి చేసుకోవడం జరిగింది. దీంతో పదవ తరగతి విద్యార్థిని ఇంటర్మీడియట్ విద్యార్థి చేతిని నోటితో గాయపరిచింది. విషయం తెలుసుకున్న పాఠశాల ప్రిన్సిపాల్ 10వ తరగతి విద్యార్థినిని మందలించినట్లు తెలుస్తోంది. మనస్థాపాన్ని గురైన పదవ తరగతి విద్యార్థిని ప్రార్థన జరుగుతున్న క్రమంలో మధ్యలోనే వెళ్లిపోయింది.
ప్రార్థన సమయములో 10వ తరగతి విద్యార్థులందరూ హాజరైనప్పటికీ సదరు పేరుకు రాకపోవడంతో అనుమానించి విద్యార్థులు అధ్యాపకులు గదులన్నీ పరిశీలించగా ఓ గదిలో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. వెంటనే విషయాన్ని పోలీసులకు ఉన్నతాధికారులకు సమాచారం అందించి, ఆ విద్యార్థినిని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనంగా మారింది. తోటి విద్యార్థులు ప్రజాసంఘాల నాయకులు మహిళా సంఘాల నాయకుల సందేహాలను, సంఘటన పూర్వపరాలను సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు నివృత్తి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి స్పష్టమైన కారణం తెలియరాలేదు.