01-06-2025 02:44:28 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ జిల్లా పరిషత్ పాఠశాలలో భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న డాక్టర్ వి. గురునాధరావు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) నిర్వహిస్తున్న జాతీయ సదస్సు 2024–25 కు ఎంపిక అయ్యారని జిల్లా విద్యాధికారి డాక్టర్ ఏ.రవీందర్ రెడ్డి వెల్లడించారు. గురునాధరావు ఎన్సీఈఆర్టీ నిర్వహిస్తున్న సదస్సులో వినూత్న విద్యా బోధన విధానాలు, ప్రయోగాలను ప్రదర్శిస్తారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతిష్టాత్మక ఎన్సీఈఆర్టీ వేదికపై మూడోసారి ప్రదర్శనకు ఎంపికైన ఏకైక ఉపాధ్యాయుడు గురునాథరావు అని తెలిపారు. ఈ సదస్సు 2025 జూన్ 26 నుంచి 27 వరకు న్యూ ఢిల్లీలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి, విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందన్నారు.విద్యా బోధనా శాస్త్రంలో కొత్త ఆచరణలను ప్రోత్సహించేందుకు ఈ వేదిక అత్యంత ప్రాముఖ్యత గలదన్నారు. గురునాధరావు ప్రాజెక్ట్ ‘హ్యాండ్స్ ఆన్ ఫిజిక్స్’ విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం, అనుభవాత్మక పఠనాన్ని అభివృద్ధి చేసేలా రూపొందించబడిందన్నారు.
2018, 2022లో నిర్వహించిన సదస్సులో పాల్గొని జాతీయ స్థాయి అవార్డులు గురునాధరావు అందుకున్నారని డీఈవో తెలిపారు. ఆయనకు రెండు డాక్టరేట్ డిగ్రీలు ఉండగా, సుమారు 100 పరిశోధనా పత్రాలను వివిధ యూనివర్సిటీలు , ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు నిర్వహించిన, సదస్సులలో, సెమినార్లలో సమర్పించిన గొప్ప అనుభవం ఉందన్నారు. సదస్సుకు ఎంపికైన గురునాధరావు కు, ఆయనను ప్రోత్సహించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె.యాదగిరి కి జిల్లా విద్యాశాఖ తరఫున డిఇఓ వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.