21-11-2025 04:20:41 PM
హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ బస్టాండ్ లోను, పరిసర ప్రాంతాలలో ప్రయాణికులు, వాహనదారులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపించాలని ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు డిమాండ్ చేశారు. హన్మకొండ బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన సందర్భంగా డాక్టర్ శేషు మాట్లాడుతూ... ఇటీవల కురిసిన మొంత తుఫాన్ కి బస్టాండ్ మొత్తం వరద ముంపు కి గురికావడమే కాకుండా, బస్టాండ్ చుట్టూ సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వలన చిన్న వర్షానికి కూడా వరద ముంపుతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
గతంలో అనేక సందర్భాలలో బస్టాండ్ ప్రాంతంలో ఏర్పడుతున్న రద్దీ దృష్ట్యా, ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా బస్టాండ్ ని అక్కడినుండి తరలించాలనే డిమాండ్ ఉన్నా,ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని అన్నారు.బస్టాండ్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి, రోడ్డుని విస్తరించడానికి ప్రైవేట్ ఆస్తులకు నష్టం జరగకుండా కార్పొరేషన్ తన స్థలాన్ని వదులుకోవాలని అన్నారు. ప్రభుత్వ అధికారులు సమన్వయంతో బస్టాండ్ వద్ద ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని, నగర ప్రజల పక్షాన విజ్ఞప్తి చేశారు.