03-02-2026 12:28:21 AM
సీపీపై మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి) : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కోర్టు విచారణ జరిపి తుది తీర్పు ఇవ్వకముందే, సీపీ సజ్జనార్ అధికారికంగా ‘ఇల్లీగల్’ అని ప్రకటించడం బాధ్యతారాహిత్యమని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ప్రజాస్వా మ్యంలో కోర్టు నిర్ధారించే వరకు ఏ ఆరోపణను కూడా నేరంగా చూడకూడదనేది కనీస న్యాయ సూత్రాన్ని పాటించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.
పోలీసుల పని కేవలం దర్యాప్తు చేయడం మాత్రమేనని, విచారణ దశలోనే ఒక అంశాన్ని చట్టవిరుద్ధమని ప్రకటించడానికి మీరేమైనా న్యాయమూర్తులా అని ప్రశ్నిస్తూ సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా కాదా అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 5(2), ఐటీ చట్టం, సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం జరిగిందా లేదా అన్నదానిపై ఆధారపడి ఉంటుందని తెలియదా అని నిలదీ శారు.
సజ్జనార్ విడుదల చేసిన అధికారిక ప్రకటన(ట్విట్టర్లో)లో ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అనే పదాన్ని వాడటం చూస్తుంటే, దర్యాప్తు ఫలితంపై మీరు ముందే ఒక నిర్ణయానికి వచ్చారని అర్థమవుతోందని వెల్లడించారు. మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడికి సంబంధించిన అంశంలో.. ఇలాంటి తొందరపాటు ప్రకటనలు చూస్తుంటే పక్షపాతంతో కూడిన రాజకీయ ప్రేరేపిత దర్యాప్తు అని స్పష్టం అవుతున్నదన్నారు.