హైదరాబాద్ కవలలకు అంతర్జాతీయ చదరంగంలో అరుదైన ఘనత
ఖైరతాబాద్, మే 5 (విజయ క్రాంతి): హైదరాబాద్ నగరానికి చెందిన కవలలు అమాయా అగర్వాల్, అనయ్ అగర్వాల్ అంతర్జాతీయ చదరంగ రంగంలో సంచలన విజయాలు సాధించి నగరానికి గర్వకారణం అయ్యారని ఏకాగ్రా చెస్ అకాడమీ చీఫ్ కో డాక్టర్ సురేష్ చైతన్య తెలిపారు. ఈ మేరకు సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
అమాయా అగర్వాల్ బోస్నియాలో జరిగిన ఎఫ్ఎం బెజిలీనా ఓపెన్ చెస్ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన కనబరిచి, ఫిడే రేటింగ్లో 2004 పాయింట్లు సాధించిందని తెలిపారు. ఏకాగ్రా చెస్ అకాడమీలో కేవలం రెండేళ్ల శిక్షణతో ఈ స్థాయి విజయం సాధించడం తమ అకాడమీకి ఎంతో గర్వకారణమని అన్నారు.అదే విధంగా, అనయ్ అగర్వాల్ బుడాపెస్ట్, బోస్నియాలో జరిగిన అంతర్జాతీయ చదరంగ టోర్నమెంట్లలో 100కు పైగా రేటింగ్ పాయింట్లు సాధించి తన ర్యాంక్ను మెరుగుపరచుకున్నాడని వెల్లడించారు.
అనంతరం కవలల తల్లి పనాషా అగర్వాల్ మాట్లాడుతూ.. నాలుగో తరగతి చదువుతున్న తమ ఇద్దరు పిల్లలు అమాయా, అనయ్లకు అత్యుత్తమ శిక్షణ అందించి, ఈ ఘనత సాధించేలా ప్రోత్సహించిన ఏకాగ్రా చెస్ అకాడమీ చీఫ్ కో సురేష్ చైతన్యకు కృతజ్ఞతలు తెలిపారు.






