30-06-2025 02:48:54 AM
ఎల్లారెడ్డిగూడలో 1,533 గజాల పార్కు స్థలం స్వాధీనం
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 29 (విజయక్రాంతి): హైదరాబాద్లో దశాబ్దాలుగా ఆక్రమణలో ఉన్న పార్కు స్థలానికి హైడ్రా విముక్తి కల్పించింది. ఎల్లారెడ్డిగూడ, మధురనగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని 1,533 గజాల విస్తీర్ణంలో ఉన్న పార్కు ఆక్రమణలను ఆదివారం హైడ్రా అధికారులు తొలగించారు. 1961లో సాయి సారధినగర్ పేరిట ఐదెకరాల్లో 35 ప్లాట్లతో లేఅవుట్ ఏర్పాటు చేశారు. ఇందులో 1533 గజాల స్థలాన్ని పార్కుగా కేటాయించినట్లు రికార్డులున్నాయి.
అయితే, ఈ లేఅవుట్ వేసిన నారాయణ ప్రసాద్ వారసులు పార్కు స్థలంలో షెడ్డు వేసి ఆక్రమించడమే కాకుండా, దొంగ పత్రాలతో ఇంటి నంబర్ను కూడా పొందారు. స్థానికులు అనేకసార్లు జీహెఎంసీకి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. సాయి సారధినగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టారు.
ఆ స్థలం పార్కు కోసమే కేటాయించినదని నిర్ధారించుకున్నారు. కమిషనర్ ఆదేశాలతో హైడ్రా బృందం ఆదివారం పార్కు స్థలంలో ఉన్న షెడ్డును తొలగించి, స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ స్థలానికి ప్రొటెక్టెడ్ బై హైడ్రా అనే బోర్డును ఏర్పాటు చేసింది.
దశాబ్దాల పోరాటం హైడ్రా రాకతో రోజుల్లోనే పరిష్కారం కావడంతో సాయి సారధినగర్ నివాసితులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. 60 ఏళ్ల పోరాట ఫలితం ఇది అంటూ ఆనందం వ్యక్తం చేస్తూ, హైడ్రా అధికారులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చర్యతో నగరంలో కబ్జాదారులకు హైడ్రా మరోసారి గట్టి హెచ్చరిక పంపింది.