calender_icon.png 24 June, 2025 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరాల్లోకి మంచుబిందువులు.. నొప్పు లకు చెక్

05-06-2025 12:16:27 AM

- క్రయోఅబ్లేషన్‌తో యువతికి కిమ్స్ వైద్యుల చికిత్స

- మూడేళ్లుగా ఏడిపిస్తున్న నొప్పి.. మటుమాయం

- తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిసారి ఈ తరహా చికిత్స 

- డాక్టర్ అనూష కారుమూరి వెల్లడి

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): నగరానికి చెందిన 26 ఏళ్ల యువతికి గతంలో గర్భసంచికి వెలుపల పిండం ఏర్పడటంతో (ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ) వైద్యులు దాన్ని తొలగించి యువతి ప్రాణాలు కాపాడారు. ఆ తర్వాత కొన్నాళ్లకు కడుపులో ఉండే సన్నటి నరాలు బాగా ఒత్తుకుపోయాయి. అవి బాగా చిన్నవి కావడంతో స్కాన్లు చేసినా ఎక్కడా కనిపించలేదు.

కానీ మూడేళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతున్నది. తీవ్రమైన నొప్పి కారణంగా ఆమె ఏడాది నుంచి బాగా ఇబ్బంది పడుతున్నది. కడుపు చుట్టూ నొప్పితో పాటు అది తొడల వరకు కూడా పాకుతోంది. దీనివల్ల ఆమెకు నిద్ర కూడా ఉండటం లేదు. ఎంతమంది డాక్టర్లను కలిసినా సమస్య ఏంటన్నది తెలియకపోవ డంతో చివరకు కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ ఆమెను పరీక్షించి చికిత్స చేసిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ అనూష కారుమూరి యువతిని లోతుగా పరీక్షించినప్పుడు నరాల సమస్య తెలిసింది.

దాంతో అప్పటికప్పుడు ఒక ఇంజెక్షన్ ఇచ్చి, తాత్కాలికంగా నొప్పి తగ్గించారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా క్రయో అబ్లేషన్ మిషన్ తెప్పించారు. ఇది ఇంతవరకు తెలుగురాష్ట్రాల్లో ఎక్కడా లేదు. తొలిసారి ఈ మిషన్‌ను కిమ్స్ ఆస్పత్రి మాత్రమే తెప్పించింది. హైదరాబాద్ యువతికి తర్వాతి దశ చికిత్సలో భాగంగా ఈ మిషన్ సాయంతో నరాల వద్దకు ఇంజెక్షన్ ద్వారా మంచు బిందువులను పంపించారు. దాంతో నొప్పికి కారణమైన నరాలు మామూలయ్యాయి. ఈ చికిత్స ప్రభావం సాధారణంగా ఏడాది నుంచి రెండేళ్ల వరకు ఉంటుంది.

మళ్లీ నొప్పి వచ్చినప్పుడు మరోసారి ఈ చికిత్స చేయించుకోవచ్చు. శరీరంలో ఏ భాగంలో వచ్చే కొన్నిరకాల నొప్పులకైనా కూడా ఈ క్రయోఅబ్లేషన్ చికిత్సతో మంచి ఫలితాలు వస్తాయి. అప్పటివరకు తీవ్రంగా బాధించిన నొప్పి దాదాపు 90 శాతం వరకు తగ్గిపోవడంతో రోగులు బెడ్ మీద నుంచి లేస్తూనే ఉపశమనం పొందుతారు. కొన్నిరకాల మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పి లాంటి వాటికి కూడా ఇది పనికొస్తుంది. నొప్పి నివారణలో ఇంత విప్లవాత్మకమైన చికిత్స రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి కిమ్స్ ఆస్పత్రిలో మాత్రమే చేయడం గమనార్హం అని డాక్టర్ అనూష కారుమూరి తెలిపారు.