01-07-2025 02:27:17 AM
-రెండుసార్లు సజావుగానే రెన్యువల్
-ప్రస్తుతం మొత్తం నగదు చెల్లిస్తే రోల్ గోల్ ఇవ్వచూపిన వైనం
-లబోదిబోమంటున్న బాధిత కుటుంబం
-మోతే ఎస్బీఐ ఉద్యోగుల నిర్వాకం
మోతె, జూన్30 : సాధారణంగా ఎవరైనా కుటుంబ అవసరాల కోసం తమకున్న బంగారమును బ్యాంకులో పెట్టి లోన్ తీసుకొని అవసరాలు తీరిన తదుపరి తిరిగి నగదు చెల్లిస్తుంటారు. లోన్ క్లియర్ కాగానే సదరు బ్యాంక్ సిబ్బంది సైతం ఖాతాదారుడు పెట్టిన బంగారంను తిరిగి ఇచ్చేస్తారు. అయితే ఓ వ్యక్తి తన అవసరాల కోసం బ్యాంకులో బంగారం ను పెట్టి రెండుసార్లు రెన్యువల్ చేసుకొని తదుపరి నగదు చెల్లిస్తే తాను పెట్టిన బంగారానికి బదులు రోల్ గోల్ ను బ్యాంకు సిబ్బంది తిరిగి చేతిలో పెట్టడంతో బాధితుడు అవాక్కయ్యాడు.
ఈ ఘటన జిల్లాలోని మోతే మండల కేంద్రంలోని యస్ బి ఐ బ్యాంక్ లో సోమవారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన జిల్లేపల్లి పరిశరాములు తన భార్యకున్న సుమారు రెండు తులాల బంగారంను 2023 మార్చి నెలలో బ్యాంకులో పెట్టినట్టు తెలిపారు. అప్పటి బ్యాంకు మేనేజర్ రమేష్ నాయక్ గోల్ లోనుకు అనుమతించి తూకం వేసి గోల్ ను సరిచూసుకొని సుమారు 18 గ్రాములు ఉన్నట్లు నిర్ధారించారన్నారు. తదుపరి రూ.65 వేల లోను ఇచ్చారన్నారు.
అనంతరం రెండుసార్లు రెన్యువల్ కూడా చేసినట్లు తెలిపారు. ప్రస్తుత బ్యాంకు మేనేజర్ రమేష్ కుమార్ ఈ లోను డబ్బు మొత్తం చెల్లించాలని చెప్పడంతో అసలు, వడ్డీ మొత్తం డబ్బులు కట్టగా.. నా బంగారానికి బదులు రోల్ గోల్ ను ఇస్తున్నట్టు తెలిపారు. అయితే సదరు బ్యాంక్ మేనేజర్ ఇదే నీది గట్టిగా చెబుతున్నాడని బ్యాంకులో బంగారం పెట్టినప్పుడు పూర్తి పరిశీలన చేసే తీసుకున్నందున రెండుసార్లు రెన్యువల్ చేశారని, అదే బంగారం ను నేడు రోల్ గోల్ అంటూ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదనతో బాధితుడు బోరున వినిపిస్తున్నాడు. ఇప్పటికైనా బ్యాంకు సిబ్బంది నా బంగారం నాకు ఇవ్వాలని బాధితుడు కోరుతున్నారు.