16-01-2026 02:55:41 PM
వెంకటాపూర్ లో పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణాల్లో ఇసుక అక్రమ నిల్వలు.
పట్టించుకోని రెవెన్యూ అటవీ శాఖల అధికారులు.
కొల్చారం,(విజయక్రాంతి): రాజకీయ నాయకుల అండదండలతో ఇసుక అక్రమ రవాణా(Illegal Sand Transportation) మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. కొల్చారం మండలం వెంకటాపూర్, కొంగోడు తదితర ప్రాంతాల నుండి రాత్రి సమయాలను అటవీ ప్రాంతాలు, హల్దీ వాగు నుండి ఇసుక అక్రమ రవాణా చేసి గ్రామ సమీపంలో రోడ్ల పక్కన నిల్వ ఉంచుతున్నారు. మండలంలోని వెంకటాపూర్ లో అటవీ ప్రాంతం నుండి రాత్రి సమయాల్లో తీసుకువచ్చిన ఇసుకను క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతి వనాలలో నిలువ చేశారు.
గ్రామానికి చెందిన సర్పంచ్ కుమారుడి ప్రమేయంతోనే రాత్రి సమయాల్లో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఇందిరమ్మ ఇంటికి బాత్రూం నిర్మాణానికి ఇసుక తీసుకువస్తే కేసులు నమోదు చేసే రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు సర్పంచ్ కుమారునికి అక్రమ రవాణాలో సహకరిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అటవీశాఖ అధికారులు ఇసుక అక్రమ రవాణా దారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై కొల్చారం తహసిల్దార్ శ్రీనివాసాచారిని వివరణ కోరగా ఇసుక డప్పుల విషయం తన దృష్టికి రాలేదని విచారణ జరిపి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.