20-09-2025 12:00:00 AM
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్.
చిట్యాల/టేకుమట్ల,సెప్టెంబర్ 19(విజయక్రాంతి):ఇందిరమ్మ ఇండ్ల పేరిట అనుమతులకు మించి అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుందని టేకుమట్ల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ అన్నారు.ఈ మేరకు శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలకేంద్రంలోని చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు.
అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కు అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సతీష్ గౌడ్ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు,మధ్య దళారులు కుమ్మక్కైఅక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే,కలెక్టర్,ఎస్పీ ఆదేశాలను లెక్కచేయకుండా అనుమతులకు మించి ఇసుక రవాణా జరుగుతుందని మండిపడ్డారు.
కేవలం టేకుమట్ల మండలంలోనే కాకుండా రేగొండ,శాయంపేట,మొగుళ్ళపల్లి,చిట్యాల మండలంలో క్వారీలను ఓపెన్ చేసి ఇసుకను తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.రోజుకు ఒక్కో ట్రాక్టర్ కు 25 ట్రాక్టర్ల ఇసుకకు అనుమతి ఉంటే రోజుకు 200 నుండి 250 ఇసుక ట్రిప్పులు తరలుతున్నాయని,దీనివల్ల ప్రజలు,రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఇసుకను అక్రమంగా డంప్ చేస్తున్న అక్రమార్కుల పైన కేసులు నమోదు చేయట్లేదని,మామూలుగా ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్న వారి పైన కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.అనుమతులకు మించి ఇసుక తరలిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బండ శ్రీకాంత్,అల్లం ఓదెలు,నాగుల నరేందర్,నాంపల్లి వీరేశం,వైనాల రవీందర్, వైణాల యశ్వంత్, క్రాంతి, శ్రీకాంత్, నూనెటీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
చర్చనీయాంశంగా మారిన కాంగ్రెస్ ధర్నా.
అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలంటూ ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని ప్రతిపక్షానికి చెందిన కొంతమంది నాయకులు, ప్రజలు విమర్శిస్తున్నారు. టేకుమట్ల,చిట్యాల,మొగుళ్లపల్లి,రేగొండ నాలుగు మండలాల వ్యాప్తంగా ఈ ధర్నా సోషల్ మీడియాలో చర్చలకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ నాయకులే అక్రమ ఇసుక రవాణా ను కొనసాగిస్తున్నారని కొంతమంది సోషల్ మీడియాలో బహిరంగంగా విమర్శించడం గమనార్హం.