30-05-2025 10:56:03 PM
కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, డీఎఫ్వో రోహిత్ గోపిడిలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హతగల ఆర్ఓఎఫ్ఆర్ హక్కులతో ఉన్న గిరిజన రైతుల ఆర్థిక, జీవన ప్రమాణాల అభివృద్ధికి ఈ పథకం బాగా దోహదపడుతుందన్నారు.
మండల స్థాయి కమిటీ ద్వారా రైతులను గుర్తించి, భూగర్భ జల సర్వేలు నిర్వహించి, బోరు బావులు నిర్మించి, సోలార్ సిస్టం ఆధారంగా మోటార్లు అమర్చి, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయం, హార్టికల్చర్ విస్తరించాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పథకాన్ని అర్హులైన వారికి సకాలంలో అందేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. గ్రామసభల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఇది ఇటీవల మాచారం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన పైలట్ ప్రాజెక్టుని గుర్తుచేస్తూ జిల్లా అధికారులు అదే దిశగా పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని కలెక్టర్ నిర్దేశించారు.