07-05-2025 05:09:48 PM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్...
జైపూర్/చెన్నూర్ (విజయక్రాంతి): అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వపరంగా ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. బుధవారం జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇండ్లు అందించడం జరుగుతుందని తెలిపారు.
సొంత స్థలం కలిగి ఉండి ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారులు తమ ఇండ్లను నిబంధనల ప్రకారం 600 చదరపు గజాలలోపు నిర్మించుకోవాలన్నారు. అర్హత గల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితా రూపొందించాలని, జాబితా తయారీలో పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు. జాబితాలో అర్హుల పేర్లు మాత్రమే ఉండాలని, అనర్హుల వివరాలు ఉన్నట్లయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.