12-06-2025 10:43:55 PM
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడులో పైలట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కె. వీరబ్రహ్మచారి, జడ్పీ సీఈవో పురుషోత్తంతో కలిసి కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, నిర్మాణంపై మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్, మండల పంచాయతీ విస్తరణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పథకం ద్వారా పేద ప్రజలకు స్వంత ఇంటి నిర్మాణాలు చేపట్టడం జరిగిందనీ, జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు ద్వారా బయ్యారం మండలం నామాలపాడు గ్రామంలో యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక కార్యచరణ ప్రకారం నిర్మాణాలు జరుగుతున్నాయని, జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులు వెరిఫికేషన్ త్వరితగతిన పూర్తి చేసి ఇందిరమ్మ కమిటీ ద్వారా గుర్తించి ఆమోదం తెలిపి పనుల ప్రతిపాదనల ప్రకారం నిధులు మంజూరు చేయాలని సూచించారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో కమిటీ సభ్యులు, లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని, ఈ పథకం అమలు కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలన్నారు.
జిల్లాలో అర్హులైన గిరిజన, పేద బడుగు బలహీన వర్గాల లబ్దిదారులు ఉన్నారని వారికి పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.పథకం అమలులో మధ్యవర్తులు, దళారుల మాటలు నమ్మవద్దని, పారదర్శకంగా ప్రభుత్వం సూచించిన ప్రకారం కమిటీల ద్వారా లబ్దిదారుల ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ప్రభుత్వ సూచనలు ప్రకారం క్షేత్రస్థాయిలో స్థానిక వనరుల సేకరణ కోసం మైనింగ్, భూగర్భజల శాఖలు సమన్వయంతో కలిసి సర్వే నిర్వహించడం జరిగిందని,తదనంతరం ప్రభుత్వ సూచనల ప్రకారం తక్షణం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ ప్రాజెక్టు డైరక్టర్ మధుసూదన రాజు, హౌజింగ్ పిడి రాజయ్య, సూపర్డెంట్ దామోదర్ రెడ్డి, జిల్లాలోనీ అందరూ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, శాంతికుమార్, నరేష్ రెడ్డి, ఉదయ్, మండల పంచాయతీ విస్తరణ అధికారులు, ఏఈలు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.