26-06-2025 06:40:38 PM
అవినీతికి పాల్పడితే 8328473007 నెంబర్ కు ఫోన్ చేయండి..
ఎమ్మెల్యే మురళి నాయక్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే 8328473007 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కండ్లుగా చేసుకొని ప్రజా పాలన నిర్వహిస్తుందని చెప్పారు. నిలువ నీడలేని పేద బడుగు బలహీన వర్గాలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలతో పక్కా ఇల్లు నిర్మించి ఇస్తుందని చెప్పారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎలాంటి అక్రమాలకు, అవకతవకలకు తావు లేకుండా పూర్తిగా పారదర్శకంగా పథకాన్ని అమలు చేయడానికి ప్రత్యేకంగా లబ్ధిదారుల సౌకర్యార్థం 8328473007 ఫోన్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఎక్కడైనా ఇంటి నిర్మాణం, బిల్లుల పెండింగ్, సలహాలు సూచనల కోసం ఈ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ఎవ్వరికీ ఒక్క రూపాయి చెల్లించాల్సిన పనిలేదని, ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే తనకు సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్యే లబ్ధిదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖలీల్, డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి, మిట్ట కంటి రాంరెడ్డి, పోతురాజు, దసురు నాయక్, రవి, రామరాజు తదితరులు పాల్గొన్నారు.