26-06-2025 06:37:21 PM
పర్యవేక్షించిన కలెక్టర్, అడిషనల్ కలెక్టర్..
ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు..
నలుగురు మంత్రుల రాకతో అలర్ట్ అయిన అధికారులు..
హుస్నాబాద్: ఈనెల 27(శుక్రవారం) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హైమావతి(District Collector Haimavati), అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్(Additional Collector Garima Agrawal)తో కలిసి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంత్రుల పర్యటనలో ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జూన్ 27 శుక్రవారం హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మంత్రుల పర్యటనకు సంబంధించి పలు కీలక కార్యక్రమాలు జరగనున్నాయని తెలిపారు.
వీటిలో భాగంగా హుస్నాబాద్ లో నూతనంగా నిర్మించిన 50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రులు ప్రారంభిస్తారన్నారు. అదే ప్రాంగణంలో 250 పడకల ప్రభుత్వ వైద్యశాలకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. దీంతో పాటు కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు ఉన్న రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి పరిచేందుకు శంకుస్థాపన చేస్తారన్నారు. ఈ కార్యక్రమాల అనంతరం మంత్రులు బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. ఈ పర్యటనలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆమె ఆదేశించారు. కలెక్టర్ వెంట హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి, డీఎంహెచ్వో పల్వాన్ కుమార్, డీసీహెచ్ఎస్ అన్నపూర్ణ, హాస్పిటల్స్ సూపరింటెండెంట్ రమేశ్ రెడ్డి, ఆర్ అండ్ బీ డీఈ, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తదితరులున్నారు.