7 July, 2026 | 2:22 AM

ఫిర్యాదుల పరిష్కారానికి చొరవ చూపాలి

07-07-2026 12:00 AM

కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి, జూలై 6: ప్రజావాణి కార్యక్రమంలో అందుతున్న ప్రతి ఫిర్యాదును అధికారులు సత్వరంగా, పారదర్శకంగా పరిష్కరించడానికి చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు సంగీత, పాండులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి వివరాలను తెలుసుకుని సంబంధిత శాఖల జిల్లా అధికారులకు వినతులను అందజేసి తగిన సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో డివిజన్ వారీగా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లో మొత్తం 66 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా  అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.