10-09-2025 06:29:40 PM
పనుల్లో ఇంకా వేగం పెంచాలి..
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 9 నెలల నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) సూచించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను బుధవారం మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. 25 ఎకరాల్లో అధునాతన హంగులతో, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నామని అన్నారు. అందులో 1 లక్ష 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ నాలుగు బ్లాకులుగా నిర్మిస్తున్నామని అన్నారు.
దీంతో పాటు స్టాఫ్ క్వార్టర్స్, డైనింగ్ హాల్, ఇతర నిర్మాణ పుట్టింగ్స్ పనులు సమాంతరంగా జరిగేలా చూసుకుంటూ పనుల్లో ఇంకా వేగం పెంచాలనీ నిర్మాణ సంస్థను ఆదేశించారు. ఎంతో మంది పేద విద్యార్థులకు కార్పోరేట్ స్థాయి నాణ్యమైన విద్య అందించేందుకు ఈ రెసిడెన్షియల్ స్కూల్ దోహదపడనుందని దాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మాణం జరగాలన్నారు. ఒకటో బ్లాక్ మొదటి స్లాబ్ అక్టోబర్ చివరి నాటికంటే ముందే పూర్తయ్యేలా పనిచేయాలని, రాష్ట్రంలోనే నల్గొండ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం ఆదర్శంగా ఉండాలని, అందుకు అనుగుణంగా అధికారులు, వర్క్ ఏజెన్సీ మనసుపెట్టి పనిచేయాలని మంత్రి సూచించారు.