01-12-2024 01:33:13 AM
38 తులాల బంగారం, ఒక కారు, రూ.40వేల నగదు స్వాధీనం
ఇబ్రహీంపట్నం, నవంబర్ 30 : శుభకార్యాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్టు మహేశ్వరం డీసీపీ సునితారెడ్డి తెలిపారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఈ నెల 14వ తేదీన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి ట్రాంక్విల్ రిసార్ట్లో ఓ వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్ఘాడ్ జిల్లా గుల్కేడ్ గ్రామానికి చెందిన నలుగురు హాజరయ్యారు. పెళ్లిలో సందడి చేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా అన్ని పనులు చేస్తూ అందరితో కలిసిమెలిసి మెలిగారు.
పెళ్లి జరిగే సమయం లో అందరి దృష్టి మరల్చి బంగారు నగలు, రూ.౪౦వేల నగదు ఉన్న బ్యాగ్తో ఉడాయించారు. ఆ తరువాత కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఓ వివాహ వేడుకలో ఇదే మాదిరిగా బంగారు నగలతో ఉన్న బ్యాగ్ను కొట్టేశారు. పారేపల్లి నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈక్రమంలో బంగారు ఆభరణాలను రికవరీ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు మహేశ్వరం డీసీపీ తెలిపారు. ఆదిబట్ల పోలీసులు మధ్యప్రదేశ్కు మూడు బృందాలుగా వెళ్లి నిందితులను పట్టుకున్నట్టు ఆమె వివరించారు. నిందితు ల నుంచి 38 తులాల బంగారు ఆభరణాలు, ఒక కారు, రూ.40వేల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామని తెలిపారు.