బెల్లంపల్లి సింగరేణి హాస్పిటల్ ఎదుట.. నల్ల బ్యాడ్జీలతో ఐఎన్టీయూసీ శ్రేణుల నిరసన
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): సింగరేణి కార్మికుల సమస్యలపై సింగరేణి వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలలో భాగంగా గురువారం బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి(Bellampalli Area Hospital) ఎదుట నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ మధు వినతి పత్రం అందజేశారు. ఆసుపత్రి కార్యదర్శి ఉమాదేవి ఏరియా కార్యదర్శి సోకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ డిప్యూటీ జనరల్ కార్యదర్శి సంగెం ప్రకాశ్ రావు, ఏరియా చీఫ్ ఆర్గనైజింగ్ కార్య దర్శి మాసాది నారాయణ పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారనీ, గుర్తింపు సంఘం కార్మిక సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందన్నారు.
అందుకే ఐఎన్టీయూసీ ఆ బాధ్యతను తీసుకున్నదని తెలిపారు. మెడికల్ అటెండెన్స్ రూల్స్ ను మార్చాలనీ, జులై 31న జరిగిన మెడికల్ బోర్డు లో కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఆ బోర్డును రద్దుచేసి తిరిగి నిర్వహించాలని కోరారు. అండర్ గ్రౌండ్లో అన్ఫిట్ అయిన మైనింగ్ స్టాఫ్, ట్రేడ్ మెన్ ఈపి ఆపరేటర్లకు సర్ఫేస్లో సూటబుల్ జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్ల నాటి సొంతింటి కలను నిజం చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏరియా ఆసుపత్రులలో నాణ్యమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో వర్క్ షాప్ పిట్ కార్యదర్శి కందుల తిరుపతి, ఏరియా ఆసుపత్రి నాయకులు వినయ్ కుమార్, శ్రీధర్ రెడ్డి, సిరికొండ శంకర్, తాటిపాముల శ్రీనివాస్ ఆడే శ్రీనివాస్ మహిళా నాయకురాల్లు భాగ్యలక్ష్మి, కృష్ణవేణి, చంద్రకళ పాల్గొన్నారు.






