24-06-2025 01:21:26 AM
ఆపరేషన్ బేషరత్ ఫతా
యుద్ధం 11వ రోజు
ఖతార్పై దాడి
టెహ్రాన్/టెల్ అవీవ్, జూన్ 23: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పోరులోకి అమెరికా ప్రవేశించడంతో యుద్ధం మరో మలుపు తీసుకుంది. అమెరికా తమపై చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పిన ఇరాన్ ఆచరణలో చూపెట్టింది. సోమవారం ఖతార్ రాజధాని దోహాలో అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులకు దిగింది. దోహాలోని అమెరికాకు చెందిన సైనిక స్థావరాలపై 10 మిసైళ్లను ప్రయోగించింది.
ఖతార్తో పాటు ఇరాక్, కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై దాడి చేసినట్టు ఇరాన్ ప్రభుత్వ టీవీ వెల్లడించింది. ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లను అడ్డుకున్నామని ఖతార్ వైమానిక దళం ప్రకటించింది. అయితే, దోహాలో భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయి. ఖతార్లోని అమెరికాకు చెందిన ‘అల్ ఉదీద్ ఎయిర్ బేస్’ను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేసినట్టు ఇరాన్ ప్రకటించింది.
పశ్చిమాసియాలోనే అమెరికాకు ఇది అతిపెద్ద సైనిక స్థావరం కాగా.. ఇక్కడ దాదాపు 10వేల మంది అమెరికా సైనికులు ఉన్నట్టు తెలుస్తోంది. తమ దేశంలోని అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ బేషరత్ ఫతా’లో భాగంగా శక్తిమంతమైన మిసైల్స్ను ప్ర యోగించినట్టు ఇరాన్ పేర్కొంది. ఇరాన్ తమ దేశంలో అమెరికా సైనిక స్థావరాలపై జరిపిన దాడులను సమర్థంగా అడ్డుకున్నట్టు తెలిపిన ఖతార్ విదేశాంగ శాఖ..
దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. ఖతార్పై దాడులను నిశితంగా పరిశీలించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిట్యుయేషన్ రూమ్కు వెళ్లారు. ఖతార్ సహా పశ్చిమాసియా దేశాల్లోని తమ స్థావరాలపై ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగా ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా, బ్రిటన్ హెచ్చరికలతో ఖతార్ తన గగనతలాన్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇక పదకొండో రోజు యుద్ధంలో ఇరు దేశాలు భీకర స్థాయిలో దాడులు చేసుకున్నాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఇజ్రాయెల్ వరుస దాడులతో ఇరాన్ను కోలుకోకుండా చేసింది. ఉదయం ఇరాన్లోని బాలిస్టిక్ క్షిపణి స్థావరాలే లక్ష్యంగా దాడులు కొనసాగించినట్టు ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది.
ఇరాన్లోని కెర్మన్ షా ప్రాంతంలో 15 యుద్ధ విమానాలతో పాటు పలు బాలిస్టిక్ క్షిపణులను నిల్వ చేసిన ప్రాంతాలను, ప్రయోగ స్థావరాలను దాడుల్లో విజయవంతంగా ధ్వంసం చేశామని ఐడీఎఫ్ తెలిపింది. ఆ తర్వాత ఇరాన్లోని వైమానిక క్షేత్రాలను టార్గెట్ చేసిన ఐడీఎఫ్.. పశ్చిమ, తూర్పు, సెంట్రల్ ఇరాన్ ప్రాంతాల్లో ఉన్న సుమారు ఆరు విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ మిలటరీ దాడులు చేసినట్టు తెలిపింది.
రిమోట్ ఎయిర్క్రాఫ్ట్లతో జరిగిన దాడిలో సుమారు 15 ఇరాన్ విమానాలు, హెలికాప్టర్లు, విమానాశ్రయ రన్వేలు, అండర్ గ్రౌండ్ బంకర్లు, రీఫ్యుయలింగ్ విమానం, ఎఫ్ ఎఫ్ ఏహెచ్ విమానాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని పేర్కొంది. కాగా ఫోర్డో లోని భూగర్భ అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ మరోసారి క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది.
అయితే ఈ దాడుల్లో ఎంత మేర నష్టం వాటిల్లిందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక టెహ్రాన్లోని ఎవిన్ జైలుపై కూడా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. జైలును టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ డ్రోన్లతో బాంబులు వేసి జైలు గోడలు బద్దలుకొట్టడం గమనార్హం. ఈ దాడిలో ఎంతమంది చనిపోయారన్నది ఇంకా తెలియరాలేదు. మరోవైపు ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది.
ఇందులో భాగంగా ఇరాన్ 15 బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్ విద్యుత్ కేంద్రాలపై దాడులకు తెగబడింది. దాదాపు 40 నిమిషాల పాటు చేసిన దాడులతో విద్యుత్ ప్లాంట్లు చాలా వరకు దెబ్బతిన్నాయని ఐడీఎఫ్ తెలిపింది. విద్యుత్ కేంద్రాలు దెబ్బతినడంతో టెల్ అవీవ్ సహా పలు ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్టు ఇజ్రాయెల్ ఒక ప్రకటనలో తెలిపింది.
పరస్పర దాడుల్లో ఇప్పటివరకు ఇరాన్లో మృతి చెందిన వారి సంఖ్య 800 దాటినట్టు అమెరికాలోని హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ పేర్కొనగా.. గాయపడ్డ వారి సంఖ్య 3400కు చేరింది. మరోవైపు ఇరాన్ దాడుల్లో 24 మంది మృతి చెందినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో మాస్కోలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
యుద్ధంలో ఇరాన్కు సాయపడేందుకు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఇరాన్పై అమెరికా తప్పుడు మార్గంలో దాడులు చేసిందని పుతిన్ ఆరోపించారు. ఇరాన్లో అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని.. తమ లక్ష్యాలకు చేరువయ్యామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఇరాన్తో సుదీర్ఘ యుద్ధం ఉండదని.. అయితే ఫలితం రాకముందే పోరాటం నుంచి నిష్క్రమించేది లేదని నెతన్యాహు పేర్కొన్నారు.
మీరు ప్రారంభించారు.. మేము ముగిస్తాం: ఇరాన్
ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్లోని అణు స్థావరాలపై అమెరికా చేసిన దాడులను ఇరాన్ మిలటరీ సెంట్రల్ కమాండ్ ఖ ండించింది. అమెరికాపై మరింత శక్తివంతమైన చర్యలకు పాల్పడతామని హె చ్చరించింది. యుద్ధం ప్రారంభించింది అమెరికా కావొచ్చు.. కానీ ముగింపు పలికేది తామేనని పేర్కొంది. తమ దేశంలోని అణు కేంద్రాలపై చేసిన దురాక్రమణలకు ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. యుద్ధంలోకి అమెరికా ప్రవేశించి తమ దళాలకు చట్టబద్ధమైన లక్ష్యాల పరిధిని విస్తరించిందని తెలిపింది.
హర్మూజ్ జలసంధిని మూసేస్తారా?
ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా బంకర్ బస్టర్లతో విరుచుకుపడడంతో ఇరాన్ ప్రతీకార వాంఛతో రగిలిపోతుంది. అయితే చమురు నిల్వలకు కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసేయనుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో పలుమార్లు దీనిని మూసేస్తామని హెచ్చరించినా ఇరాన్ అంత సాహసం చేయలేదు. ఈ జలసంధిని కొన్ని గంటలు లేదా రోజులు మూసేస్తేనే చమురు ధరలు భగ్గుమనే అవకావముంది.
ఇరాన్ హర్మూజ్ను మూసివేయాలంటే తన అతిపెద్ద చమురు కస్టమర్ అయిన చైనా అనుమతి ఉండి తీరాలి. ఇది అసాధ్యం కాబట్టి.. హర్మూజ్ జలసంధిని మూసేయకుండా చమురు సరఫరాలను దెబ్బతీసే అవకాశం ఇరాన్కు ఉంది. ప్రపంచంలో 7శాతం ఉత్పత్తి హర్మూజ్ నుంచే జరుగుతున్న సంగతి తెలిసిందే.