24 July, 2026 | 3:21 AM

అక్రమాలను అరెస్టులతో దాచలేరు

24-07-2026 12:09 AM

ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

దమ్మపేట, జూలై 23, (విజయక్రాంతి): ప్రశ్నాపత్రాల లీకేజీలపై శాంతియుత ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించిన అమానుష వైఖరిని నిరసిస్తూ దమ్మపేట మండల కేంద్రంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్లో (నీట్ సహా) వరుసగా చోటుచేసుకుంటున్న ప్రశ్నాపత్రాల లీకేజీలతో కోట్లాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితులకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం, వారి గొంతును అణచివేసే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర విరుద్ధమని ఆయన మండిపడ్డారు. నీట్ అక్రమాలను ప్రశ్నించిన కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇతర నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ దమ్మపేట వై ఎస్ ఆర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు.

నిజాలను అరెస్టులతో దాచలేరని, విద్యార్థుల భవిష్యత్తు కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కక్కిరాల రమేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాక రమేష్, స్థానిక సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు, టౌన్ అధ్యక్షులు చిట్టిబాబు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిశెట్టి సత్య ప్రసాద్ ,జిల్లా కాంగ్రెస్ మహిళా ప్రధాన కార్యదర్శి పొదిలి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.