20-12-2025 12:14:42 AM
బెజ్జూర్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): మండల కేం ద్రంలోని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రంలో ఆయుర్వేద వైద్య సేవలు ప్రజలకు అందని ద్రాక్షలాగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ నేహా జనవరి11, 2022న వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే రెండు నెలలు మాత్రమే సేవలు అందించి లాంగ్ లీవ్ పెట్టారు. అనంతరం డిప్యూటేషన్పై సూర్యపేట జిల్లా బర్కత్ గూడెం వెళ్లారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో ఆయుర్వేద వైద్యాధికారి లేకపోవడంతో పాటు, ఆయుర్వేద మందులు కూడా నిల్వలేవని ఫార్మసిస్ట్ వొల్లాల అశోక్ గౌడ్ వచ్చి న రోగులకు తెలియజేస్తున్నారు. పేరుకే ఆయుర్వేద వైద్యశాలగా ఉందని, ఆసుపత్రికి వచ్చిన రోగులు ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్తున్నారని ప్రజలు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు ఎలాంటి సైడ్ ఎఫెకట్స్ లేకుండా ఆయుర్వేద వైద్యం అందించాలని ఉద్దేశించగా, ఆశతో ఆసుపత్రికి వచ్చే ప్రజలకు నిరాశే మిగులుతోందని మండలవాసులు పేర్కొంటున్నారు.
ఈ విషయమై వరంగల్ ప్రాంతీయ ఆయుష్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రమీల దేవిని వివరణ కోరగా, వైద్యుల నియామకానికి సంబంధించి నివేదిక పంపించామని తెలిపారు. ప్రస్తుతానికి 15 రోజుల్లో మందులు పంపించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఫార్మసిస్ట్ అశోక్ గౌడ్ అందుబాటులో ఉండి రోగులకు మందులు అందేలా ఆదేశిస్తామని వెల్లడించారు.