01-02-2026 02:04:16 AM
హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): ‘బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఏమైనా ఫ్రీడం ఫైటరా? రేపోమాపో జైలుకు పోయే వాళ్లే కదా.. ఆయన కూడా చట్టానికి సహకరించాల్సిందే’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అంటే ప్రజల్లో నమ్మకం లేదన్నారు. బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్తో ఫామ్హౌస్ కేసులుపెట్టి చివరకు ఫామ్హౌస్కే పరిమితమయ్యిందని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఎన్ రాంచందర్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఫామ్హౌస్ అన్నా... ఫామ్హౌస్ రాజకీయాలన్నా బీఆర్ఎస్కు మక్కువ అని తెలిపారు. ఎవరెవరికి ఎన్ని ఫామ్హౌస్లున్నాయో ప్రజలకు తెలుసన్నారు. గతంలో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు సిట్ విచారణకు హాజరయ్యారని, మాజీ సీఎం కేసీఆర్ కూడా చట్టానికి సహకరించాల్సిందేనని రాంచందర్రావు స్పష్టంచేశారు. విచారణ తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటవుతాయని ఆయన పేర్కొన్నారు.
‘పురపోరు’లో బీజేపీ అన్నింటా పోటీ
తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 2996 వార్డులు, డివిజన్ల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వందశాతం పోటీకి నామినేషన్లు సమర్పించిందని రాంచందర్రావు చెప్పారు. అం దు కు సంబంధించి అభ్యర్థులకు బీ-ఫారమ్లు కూడా అందజేశామని పేర్కొన్నారు. గత ఎంపీ, ఎమ్మెల్సీ, సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీపై చూపిన విశ్వాసాన్ని గమనించి, ప్రతి స్థానంలో పోటీ చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలతో ప్రజల నమ్మకానికి ద్రో హం చేస్తున్నాయని విమర్శించారు.
ముఖ్యంగా మున్సిపాలిటీస్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన లే అవుట్ రెగ్యులేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) ద్వారా ప్రజలను ఇబ్బందులు పెట్టారన్నారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఎల్ఆర్ఎస్ ఫీ జును రద్దు చేస్తూ ఈ 15 రోజుల్లో రెగ్యులేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్తో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. గతంలో చేసిన లూటీ పద్ధతినే కొనసాగిస్తోందని ఆరోపించారు. 20 లక్షల పైగా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు ఇంకా డిస్పోజ్ కాలేదన్నారు.
రాష్ట్రంలో రో జురోజుకూ శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలు కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఆధారపడి నడుస్తున్నాయని, డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్య క్షురాలు జయశ్రీ, ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్వీ సుభాష్, సీనియర్ నాయకులు ఆంటోని తదితరులు పాల్గొన్నారు.