09-08-2024 12:35:28 PM
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్న కొద్దిరోజుల ముందు ఐఎస్ఐఎస్ ఉగ్రవాది రిజ్వాన్ అలీని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని దర్యాగంజ్లో నివాసం ఉంటున్న రిజ్వాన్ అలీ తీవ్రవాద సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రాడార్లో ఉన్నాడు. ఎన్ఐఏ రిజ్వాన్ పై గతంలో రూ. 3 లక్షల రివార్డు ప్రకటించింది. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు గురువారం రాత్రి రిజ్వాన్ అలీని అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, రిజ్వాన్ అలీ తుగ్లకాబాద్ ప్రాంతంలోని బయోడైవర్సిటీ పార్కుకు రాత్రి 11 గంటల సమయంలో వస్తారని సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన స్పెషల్ సెల్ వల వేసి వాంటెడ్ టెర్రరిస్టును విజయవంతంగా పట్టుకుంది. ఈ ఆపరేషన్ రిజ్వాన్ అలీ వద్ద నుండి 30 బోర్ స్టార్ పిస్టల్, మూడు లైవ్ కాట్రిడ్జ్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం రిజ్వాన్ అలీ నుంచి మరిన్ని వివరాలను వెలికితీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.