బోథ్ గడ్డను మోసం చేసింది కాంగ్రెస్సే..
- మాజీ మంత్రి జోగు రామన్న ధ్వజం...
- ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరికలు
బోథ్, డిసెంబర్15(విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బోథ్ కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి బోథ్ను రెవెన్యూ డివిజన్గా చేస్తానని హామీ ఇచ్చి, అ తర్వాత హామీని తుంగలో తొక్కి బోథ్ గడ్డను మోసం చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ధ్వజమెత్తారు. సోమవారం బోథ్, సోనాల పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలి పించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ పార్టీలోకి చేరగా వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాట్లాడుతూ... కష్టం విలువ తెలిసిన బోథ్ అభ్యర్థి ఎలుక స్వప్నప్రియ రాజు గెలిస్తే బోథ్ కొరకు కొట్లాడుతాడని, బోథ్ ను అభివృద్ధి పథంలో నడుపుతారని అన్నారు.
తెలంగాణ తెచ్చింది కేసీఆర్, అభివృద్ధి చేసింది కేసీఆర్ అని భవిష్యత్తులో అభివృద్ధి జరగాలంటే కెసిఆర్ పార్టీ అభ్యర్థికి మద్దతు పల కాలని కోరారు. జిల్లాలో సోనాల ప్రత్యేక మం డలం ఏర్పాటు కేసీఆర్ వల్లనే సాధ్యమైందని, ఇప్పుడు ఆ పార్టీకి మండల ప్రజలు అండగా నిలవాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నా రు. గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యమని, రానున్నది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు






