23-07-2024 12:30:53 AM
ప్లకార్డులను లాక్కొని చించిపడేసే అధికారం ఎవరిచ్చారని ఫైర్
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసుల తీరుపై మండిపడ్డారు. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలు ధరించి ఉభయసభలకు హాజరయ్యారు. ప్లకార్డులతో అసెంబ్లీకి వచ్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జగన్కు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. జగన్తో సహా వైసీపీ నేతలను పోలీసులు నెట్టివేయడంతో ఆయన పోలీసుల తీరుపై మండిపడ్డారు.
తమ చేతుల్లో ఉన్న ప్లకార్డులను లాక్కొని చించిపడేసే అధికారం మీకు ఎవరిచ్చారంటూ అక్కడనున్న పోలీసు అధికారిని నిలదీశారు. మదుసూదన్రావు గుర్తు పెట్టుకో అంటూ అక్కడున్న పోలీసు అధికారిని ఉద్దేశించి హెచ్చరించారు. ఎల్లకాలం ఇదే మాదిరిగా ఉండదని, ప్రజాస్వామ్యం లో ఉన్నామని గుర్తించుకోవాలన్నారు. నీ టోపి మీద ఉన్న సింహాలకు అర్ధం ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడం పోలీసుల పని కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే పోలీసులు ఉన్నారని గుర్తు చేశారు.