03-06-2025 06:32:30 PM
జాతీయ విద్యా విధానం అమలులో విశ్వవిద్యాలయం అగ్రగామిగా నిలవాలి..
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ..
కూకట్పల్లి (విజయక్రాంతి): జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్(Jawaharlal Nehru Technological University Hyderabad) 13వ స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(State Governor Jishnu Dev Verma) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... యూనివర్సిటీ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు, జేఎన్టీయూహెచ్ సిబ్బందిని అభినందించారు.
2023–2024 విద్యా సంవత్సరానికి మొత్తం 91,840 డిగ్రీలు ప్రదానం చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్గ్రాడ్యుయేట్, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, డాక్టరేట్లు ఉన్నాయని తెలిపారు. ఈ విజయాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యుల మద్దతు ఎంతగానో ఉందని అన్నారు. జాతీయ విద్యా విధానం అమలులో విశ్వవిద్యాలయం అగ్రగామిగా నిలుస్తున్నదని, నూతన కోర్సులు, డిజిటల్ ఆధారిత అభ్యాసకేంద్రిత మోడళ్లను ప్రవేశపెట్టి విద్యా రంగంలో ఉన్నత ప్రమాణాలు చేపడుతూ కొత్త ఒరవడిని తీసుకొచ్చిందని గవర్నర్ కొనియాడారు. సుమారు రూ. 498 కోట్ల పరిశోధన నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల నుండి పొందినట్లు ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాల అనుసరణలో భాగంగా 25 దేశాల నుండి 237 విదేశీ విద్యార్థులు జేఎన్టీయూహెచ్ లో చేరడం విశ్వవిద్యాలయ వైవిధ్యాన్ని, గ్లోబల్ గుర్తింపును చాటుతోందని వివరించారు. జ్ఞానాన్ని సంపాదించడమే కాదు, దాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించడమే నిజమైన విద్య అని ఆయన అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న ఈ యుగంలో, విద్యార్థులు సృజనాత్మకత, నైతికత మానవీయ విలువలతో ముందుకు సాగాలని సూచించారు. స్వావలంబన భారత్ దిశగా యువత ముందుండి నడిపించాలన్నారు. శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణలు సమాజసేవలలో విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.