06-11-2025 12:55:13 AM
తుంగతుర్తి (నాగారం), నవంబర్ 5 : నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో గల శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. శివునికి ప్రీతికరమైన కార్తీకమాసంలోని విశేషమైన పౌర్ణమి సందర్భంగా బుధవారం ఆలయంలో సహస్ర దీపోత్సవం నిర్వహించారు. దశాబ్ద కాలంగా ప్రతి ఏటా ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు, భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, వేయి దీపాలు వెలిగించారు. దీపాల కాంతులతో ఆలయం దేదీప్యమానంగా కళకళలాడింది. ఆలయ అర్చకులు శ్రీ బొల్లోజు. బ్రహ్మచారి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం గ్రామానికి చెందిన అనుముల. శివనాగప్రసాద్ ఆలయానికి సమర్పించిన పులి హోర ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, యువకులు పాల్గొని ,స్వచ్ఛంద సేవలు అందించారు.