06-11-2025 12:54:48 AM
-రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే యుద్ధమే
-బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య
ముషీరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకు వచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతుందని జాతీయ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వైఖరి మార్చుకొని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరారు.
లేనిపక్షంలో ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకుంటారని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ విద్యార్థుల ఫీజు ఫీజు రియింబర్స్మెంట్ను ఎత్తేసే యోచనలో ప్రభుత్వం ప్రయత్ని స్తే రాష్ట్రంలో యుద్ధమే కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఉన్నత చదువులు చదివి, గొప్ప స్థాయిలో స్థిరపడ్డారని తెలిపారు.
కాంట్రాక్టర్లకు వేల కోట్లు విడుదల చేస్తున్న ప్రభు త్వానికి, విద్యార్థుల భవిష్యత్ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయకుండా కాలయాపనకే ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం సమస్యను పక్కదారి పట్టించడానికి విజిలెన్స్ దాడులు చేయిస్తోందని ఆరోపించారు.
ఫీజుల సమస్యలను చర్చించ డానికి వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న ఆరు వేల కోట్లు ఫీజు రియింబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు జి. అనంతయ్య, చెరుకు మణికంఠ, రాజు నేత, సి.రాజేందర్, టి. రాజ్ కుమార్, మోడీ రాం దేవ్, చిక్కుడు బాలయ్య, లింగయ్య, శివలీల తదితరులు పాల్గొన్నారు.