బీఆర్ఎస్ నేతలను ప్రజలు ఛీత్కరిస్తున్నారు
కౌశిక్రెడ్డి నోటి దురుసే బీజేపీ కార్యకర్తల ఆగ్రహానికి కారణం
కరీంగనగర్ బంద్ పిలుపులో ప్రజాశ్రేయస్సు ఎక్కడుంది?
బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): బీఆర్ఎస్ నేతలను రాష్ట్ర ప్రజలు ఛీత్కరిస్తున్నా వారిలో మార్పు రాకపోవడం సిగ్గు చేటని బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఏ ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ నేతలు కరీంనగర్ బంద్కు పిలుపు ఇచ్చారు? అని ప్రశ్నించారు.
బీజేపీ కార్యకర్తల ఆగ్రహానికి కారణం పాడి కౌశిక్ రెడ్డి నోటి దురుసు ఫలితమేనని, ఇందులో ప్రజాకోణం ఏముంది? అని నిలదీశారు. కరీంనగర్ బంద్ పేరుతో బీఆర్ఎస్ నేతలు అరాచకం చేయాలనుకుంటున్నారా అన్నారు. ఈమేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనను విడుదల ఏశారు. ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ కార్యకర్తల తలలు పగలకొట్టినప్పుడు, వడ్ల కొనుగోలు కేంద్రాల పరిశీ లనకు వెళ్లినప్పుడు బీజేపీ నాయకుల వాహనాలను ధ్వంసం చేసినప్పుడు బీఆర్ఎస్ నేతలకు గుర్తుకు రాలేదన్నారు.
అసలు ఈ వివాదానికి మూలకారకుడు కేటీఆర్ కాదా? అన్నారు. కాందిశీకుల భూముల వ్యవహారంలో సీఎంతో, బండి సంజయ్ కుమ్మక్క య్యారని అడ్డగోలు ఆరోపణలు చేసింది కేటీఆరే అన్నారు. ప్రజల దృష్టిని దారి మళ్లిం చేందుకు బీఆర్ఎస్ చెంచాలతో బూతులు తిట్టిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది కేటీఆరే అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇకనైనా బుద్ది తెచ్చుకుని ప్రజా సమస్యలపై పోరాడాలని, లేనిపక్షంలో ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరించారు.






