మనకు 16, ఏపీకి 10 టీఎంసీలు
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి) : కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు తాగునీటి కేటాయింపులపై కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని జలసౌధలో మంగళవారం జరిగిన సమావేశంలో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నీటి నిల్వలు, విడుదలపై కేఆర్ఎంబీ అధికారులు చర్చించి ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.
శ్రీశైలం,నాగార్జునసాగర్ నుంచి తెలంగాణకు 16 టీఎంసీలు, ఏపీకి 10 టీఎంసీల కేటాయింపులకు కమిటీ ఆమోదం తెలిపింది. శ్రీశైలం, సాగర్ నుంచి ఏపీ ప్రభుత్వం అధిక మొత్తం లో నీటిని తరలిస్తోందని తెలంగాణ అధికారులు కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి 5, సాగర్ నుంచి 13 టీఎంసీలు కలిపి 18 టీఎంసీలు కేటాయించాలని మే 2న కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు.
అలాగే ఏపీ కూడా నాగార్జునసాగర్ నుంచి మే 31వ తేదీ వరకు 10 టీఎంసీలు కేటాయించాలని ఏప్రిల్ 29న కృష్ణా బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా కృష్ణా బోర్డు ౨౧వ సర్వసభ్య సమావేశం ఈ నెల 14న హైదరాబాద్లో సమావేశం కానుంది. బోర్డు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఆసక్తిగా మారింది.






