09-08-2024 12:14:30 PM
హైదరాబాద్: సుంకిశాల ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. ప్రభుత్వం తప్పు లేకుంటే.. సుంకిశాల ఘటనను వారం రోజులపాటు ఎందుకు దాచి పెట్టారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ నీటి అవసరాల కోసం సుంకిశాల ప్రాజెక్టు మొదలు పెట్టారని చెప్పారు. సుంకిశాల ప్రాజెక్టు పునరుజ్జీవనం తెచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. నాగార్జున సాగర్ లో డెడ్ స్టోరేజ్ ఉన్నా హైదరాబాద్ కు నీటి కష్టాలు రాకూడదనే ఈ ప్రాజెక్టు చేపట్టామని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సాగు, తాగునీటి కోసం ఉపయోగపడుతోందన్నారు. కృష్ణానదికి నాలుగేళ్లు నీరు రాకపోయినా సుంకిశాల ప్రాజెక్టుతో నీటి ఇబ్బందులు రావు అని ఆయన వెల్లడించారు. బెంగళూరు, ఢిల్లీ, చెన్నైలో నీటి ట్యాంకర్ల కోసం ప్రజలు పోరాడుతున్నారన్న కేటీఆర్ హైదరాబాద్ లో నీటి కోసం ఇబ్బందులు పడే పరిస్థితి లేదన్నారు. హైదరాబాద్ 50 ఏళ్లు తాగునీటి అవసరాలకు సరిపడేలా ప్రణాళికలు చేశామని తెలిపారు.