14-01-2026 02:26:52 AM
19న కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి
ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్,జనవరి13(విజయక్రాంతి): రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మేయర్ పీఠం టిఆర్ఎ స్ పార్టీ దేనని మాజీ మంత్రి, కరీంనగర్ ఎ మ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్య నా య కులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఉపయోగపడే అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎప్పుడెప్పుడా ఎన్నికలు వస్తాయా బిఆర్ఎస్ పార్టీ నీ గెలిపించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అప్పటి వరకూ పార్టీ కార్యకర్తలు ప్రజలతో మమేకమై, వారి సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ రెండేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. ప్రజల్లో ఈ రెండు పార్టీలపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను తయారు చేస్తుందన్నారు. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలకు ఇంచార్జిలుగా మాజీ మంత్రి హరీష్ హరీశ్రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లు ఉంటారని తెలిపారు. ఎప్పుడూ ఎన్నికలు వచ్చిన సిద్ధంగా ఉన్నామని, సరైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఒక్కో డివిజన్ కు ఒక్కొక్కరు బాధ్యతలు తీసుకుని ముందుకు సాగుతామని వెల్లడించారు. కొంతమంది పార్టీని వదిలి వెళ్లినా తమకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు.
ఎన్ని సర్వేలు చేసినా విజయం బీఆర్ఎస్ పార్టీదేనని, నూటికి 90 శాతం ఫలితాలు మనకే అనుకూలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. రాబోవు కాలంలో కేసీఆర్ నాయకత్వంలో రానున్న15 ఏళ్లు బీఆర్ఎస్పార్టీ అధికారంలో ఉంటుందన్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నాయకులకు సూచించారు. ఈ నెల 19న కేటీఆర్ కరీంనగర్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు, ఆయా డివిజన్ల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.