23-07-2025 01:08:00 AM
24న 5 వేల మంది తల్లులకు కేసీఆర్ కిట్ల పంపిణీ
హైదరాబాద్, జూలై 22 (విజయ క్రాంతి): ఈ నెల 24వ తేదీన తన పుట్టిన రోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్ముల్’ పేరిట ఐదు వేల మంది తల్లులకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేయనున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కేసీఆర్కు మంచి పేరు వస్తుందన్న ఉక్రోశంతోనే రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లను ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లతో మాత శిశు మరణాలు గణనీయంగా తగ్గి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని పేర్కొన్నారు.
తన పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్కు చెందిన తల్లి బిడ్డలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ కిట్లను అందించారు. గత 20 నెలల నుంచి కేసీఆర్ కిట్లను ఇవ్వకపోవడంతో చాలా మంది తల్లులు బాధపడుతున్నారని చెప్పారు. అందుకే తన పుట్టిన రోజు సందర్భంగా 5 వేల మంది తల్లులకు సిరిసిల్లలో కేసీఆర్ కిట్లను ఇవ్వనున్నట్లు తెలిపారు.
2014కు ముందు నేను రాను బిడ్డో సర్కారు దవఖానకు అని జనాలు భయపడేవారని, సీఎంగా కేసీఆర్ తీసుకున్న చర్యలతో సర్కార్ దవాఖానాకే పోవాలని జనాలంతా అనుకున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలను మార్చిన కేసీఆర్ కిట్లను గత 20 నెలల నుంచి రేవంత్ సర్కార్ ఇవ్వకపోవడం దుర్మార్గం అన్నారు. కేసీఆర్ మీద ఉన్న అంతులేని ద్వేషం, కోపమే ఇందుకు కారణమని విమర్శించారు.