నిండు గర్భిణికి... ప్రసూతి కష్టాలు
* కాలి నడకతో వెళితే కానీ.. ఆసుపత్రికి చేరుకోలేరు
* ఆదిలాబాద్ రూలర్ మండలంలోని బొప్పాపూర్లో ఘటన
ఉట్నూర్, ఆగస్ట్ 26( విజయక్రాంతి ): ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామాల గర్భిణీలకు ప్రసూతి కష్టాలు తప్పడం లేదు. ఏజెన్సీలోని మారుమూల గిరిజన గ్రామాలకు మట్టి రోడ్లు... కొద్ది పాటిగా వర్షం పడితే చాలు ఆ మట్టి రోడ్లు బురదమయం అవుతున్నాయి. బురదతో నిండిపోయిన రోడ్లపైకి 108 అంబులెన్స్ రావడం కష్టం. దీంతో మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు, నిండు గర్భిణులు కాలి నడకనే 108 అంబులెన్స్ ఉన్న చోటుకు అష్టకష్టాలు పడుతూ చేరుకుంటున్నారు.
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఆశోద పంచాయతీ పరిధిలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన మాడవి కవిత(20) పురిటి నొప్పులతో బాధపడుతుండగా గ్రామానికి చెందిన ఆశ వర్కర్ పేందూర్ శాంతాబాయి గ్రామం నుండి ఇంద్రవెల్లి మండలంలోని బొప్పాపూర్ గ్రామం వరకు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం కాలినడకతో తీసుకెళ్లింది. బొప్పాపూర్ నుంచి జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు తీసుకెళ్లారు. రిమ్స్ ఆస్ప్రతిలో అక్కడ వైద్యులు రెండు రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో మరో 10 రోజుల ప్రసూతికి సమయం ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దీంతో పది రోజులపాటు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో ఉండలేమని.. పది రోజుల పాటు భోజనాల ఖర్చులు తమ చేతిలో లేవని బుధవారం ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు.






