ఢిల్లీలో జూలై 20 నుండి 22 వరకు లాల్దర్వాజా బోనాల ఉత్సవాలు
దేవాలయం చైర్మన్ అరవింద్ కుమార్ గౌడ్
ముషీరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో జూలై 20,21,22 తేదీలలో మూడు రోజుల పాటు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం చైర్మన్ జి. అరవింద్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
ఈ మేరకు మంగళవారం హైదర్గూడ లోని ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవాలయ ప్రధాన కార్యదర్శి పోసాని సతీష్ ముదిరాజ్, మాజీ చైర్మన్లు వెంకటేష్, ఎ. బద్రినాథ్, పోసాని సురేందర్ ముదిరాజ్ లతో కలిసి చైర్మన్ అరవింద్ కుమార్ గౌడ్ ఉత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో నిర్వహించనున్న బోనాల ఉత్సవాలు తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక గా నిలుస్తాయని పేర్కొన్నారు.
జూలై 20 న ఫోటో ఎగ్జిబిషన్, 21 న ఇండియా గేట్ నుండి తెలంగాణ భవన్ వరకు వెయ్యి మంది భక్తులతో భారీ ఊరేగింపు, 22 న బోనాల ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. ఈ సందర్భంగా సింహవాహిని శ్రీ మహంకాళి లాల్ దర్వాజా దేవాలయం 118 వార్షిక బోనాల మహోత్సవాల షెడ్యూల్ ను ప్రకటించారు.
బోనాల ఉత్సవాలు జులై 31వ తేదీన శుక్రవారం రోజున ధ్వజారోహణ, శిఖర పూజా కార్యక్రమాలతో ప్రారంభమవుతాయని తెలిపారు. అనంతరం ఆగస్టు 9, 10 తేదీలలో ప్రధాన బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు అరవింద్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎ.భరత్ కుమార్, పి. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.






