05-05-2025 12:00:00 AM
హుజూర్ నగర్/కోదాడ, మే 4: రాష్ట్ర వ్యాప్తంగా మేజర్ ప్రాజెక్టులలో పూడిక తీత పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.నీటి సామర్ధ్యం పెంచేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అంకురార్పణ చుట్టిందని ఆయన వెల్లడించారు. జాతీయ కార్యక్రమంగా పూడిక తీత పనులు మొదలు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు.
ఆదివారం ఉదయం కోదాడ నియోజకవర్గ కేంద్రం లోనీ స్థానిక శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ క్యాంప్ కార్యాలయంలో ఆయన నీటిపారుదల శాఖాధికారు లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తేజ నందలాల్ పవార్, నీటిపారుదల శాఖా సి.ఇ రమేశ్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాగార్జున సాగర్,శ్రీరాంసాగర్ ప్రాజెక్టులలో మట్టి,ఇసుక పేరుకు పోవడంతో నీటి సామర్ధ్యం తగ్గి పోయింద న్నారు.ఆరు దశాబ్దాలుగా పూడిక తీత పనులు చేపట్టక పోవడంతో నీటి లభ్యత తగ్గి పోయి టెల్ ఎండ్ భూములకు సరిపడా నీరు అందడం లేదన్నారు.
ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారాం సాగర్ ప్రాజెక్టుకు 67 టి.యం.సి ల గోదావరి జలాల నీటి కేటాయింపును కాంగ్రెస్ ప్రభుత్వం సాదించిందన్నారు.కునేరు నుండి పాలేరు రిజర్వాయర్ కు వరద కాలువ ద్వారా పది టి.యం.సి ల నీటిని తరలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.తద్వరా పాలేరు వద్ద ఎత్తిపోతల పధకం నిర్మించి కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతె మండలానికి నీరు అందించ నున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
హుజూర్నగర్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరుగుతున్న అభివృద్ధిలో ప్రతీ ఒక్కరు విధిగా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.హుజుర్నగర్, కోదాడ నియోజకవర్గాలకు చెందిన ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందిం చేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తన జీవితాన్ని ప్రజా జీవితానికి అంకితం చేసి నిబద్ధత, నిజాయితీతో పారదర్శకంగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటు పదుతున్నానని ఆయన అన్నారు. ఆదివారం ఉదయం హుజుర్నగర్ నియోజకవర్గ పరిధిలోని 231 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ/షాధి ముబారక్ పధకంలో భాగంగా రెండు కోట్ల ముప్పయి లక్షల రూపాయల చెక్ లను ఆయన లబ్ధిదారులకు అందజేశారు.
ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గాను హుజుర్నగర్ లో 7.50 కోట్ల వ్యయంతో జూనియర్ కళాశాల భవనం,4.50 కోట్లతో డిగ్రీ కళాశాల భవనాలను నిర్మిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
హుజుర్నగర్,కోదాడ ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకే వేల కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పధకాలను నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అర్హులైన నిరుపేదలకు ఉచితంగా అందించే సన్న బియ్యం పంపిణీ హుజుర్నగర్ లో ఉగాది పర్వదినం రోజున ప్రారంభించడం ముమ్మాటికీ ఒక చారిత్రాత్మకమైన సందర్భంగా ఆయన అభివర్ణించారు.